నవతరం

తెలుగు దినపత్రిక

మణికొండకు సరికొత్త కళ

* ప్రారంభోత్సవంతో పండుగ వాతావరణం
* రూ. 22 కోట్లతో మున్సిపల్ భవనం, క్రికెట్ స్టేడియం ప్రారంభం
* త్వరలో రూ. 100 కోట్లతో పందెం వాగుపై వంతెన: మంత్రి శ్రీధర్ బాబు

మణికొండ: అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో మణికొండ మున్సిపాలిటీలో పండుగ సందడి నెలకొంది. పెరుగుతున్న నగర విస్తరణకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించిన ప్రభుత్వం, మణికొండ రూపురేఖలు మార్చేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రూ. 18.5 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మించిన నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఈ కొత్త భవనం రూపుదిద్దుకుంది.యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలనే లక్ష్యంతో మున్సిపాలిటీ పరిధిలో రూ. 3.5 కోట్లతో నిర్మించిన క్రికెట్ స్టేడియాన్ని కూడా మంత్రి ఆవిష్కరించారు.
ఒకే రోజు రెండు ప్రధాన అభివృద్ధి పనులు అందుబాటులోకి రావడంతో స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

పందెంవాగు కష్టాలకు చెక్..
మణికొండ వాసులను వర్షాకాలంలో ఇబ్బంది పెడుతున్న వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రూ. 100 కోట్లతో పందెం వాగుపై స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. దీంతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేశామని, దశలవారీగా వాటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సి పట్నం మహేందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కె నరేందర్ రెడ్డి, కమిషనర్ ప్రదీప్ కుమార్, గుడ్డి మల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్, మాజీ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. స్థానికులు పెద్ద ఎత్తున హాజరై ఈ ప్రగతి పర్వంలో భాగస్వాములయ్యారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading