నవతరం

తెలుగు దినపత్రిక

కామాంధుడైన ప్రొఫెసర్.. కటకటాల వెనక్కి

* జేఎన్టీయూలో దారుణం.. గెస్ట్ ఫ్యాకల్టీపై లైంగిక దాడి
* ఒకే సామాజిక వర్గమంటూ నమ్మించి.. వంచించాడు
* ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ బెదిరింపులు
* బాధితురాలి కాపురం కూల్చిన కీచకుడు
* నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

కూకట్‌పల్లి, నవతరం: విద్యాబుద్ధులు నేర్పించి, సమాజానికి మార్గనిర్దేశం చేయాల్సిన ఓ ప్రొఫెసర్ కామాంధుడిగా మారాడు. తన కింద పనిచేసే మహిళా ఉద్యోగిని (గెస్ట్ ఫ్యాకల్టీ) రక్షించాల్సింది పోయి.. భక్షించాడు. తన సామాజిక వర్గమే కదా అని నమ్మి ఉద్యోగంలో చేరిన ఆమె జీవితాన్ని చిదిమేశాడు. ఈ దారుణ ఘటన ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTU)లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడైన ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నమ్మించి.. లోబరుచుకుని.. జేఎన్టీయూలో గెస్ట్ ఫ్యాకల్టీగా చేరిన బాధితురాలికి, అక్కడ పనిచేస్తున్న ఓ ప్రొఫెసర్ పరిచయమయ్యాడు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో.. ఆమెకు తండ్రిలా, మంచి కోరుకునే వ్యక్తిలా నటించాడు. ఆమెకు అండగా ఉంటానని నమ్మబలికాడు. అయితే ఉద్యోగంలో కుదురుకున్న కొన్నాళ్లకే ప్రొఫెసర్ తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తాను చెప్పినట్లు వినకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తానని, ఈ విషయం భర్తకు తెలిస్తే బతుకు బస్టాండ్ అవుతుందని బెదిరింపులకు పాల్పడ్డాడు.

కారులో తీసుకెళ్లి అఘాయిత్యం
బాధితురాలు ఉద్యోగంలో చేరిన ఆరు నెలల సమయంలో.. ఒకరోజు మధ్యాహ్నం పని ఉందంటూ ఆమెను తన కారులో బయటకు తీసుకెళ్లాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె అనారోగ్యం పాలై, కడుపు నొప్పితో బాధపడుతున్నా కనికరించలేదు. నన్ను వదిలేయండి సార్.. ఇబ్బంది పెట్టకండని ఆమె కాళ్లావేళ్లా పడినా ఆ కీచకుడు వినిపించుకోలేదు. విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్‌కు పిలిపించుకుని మరీ బలవంతం చేయడానికి ప్రయత్నించేవాడు. ఆఫీసు పని పేరుతో ప్రొఫెసర్ ఆమెను అర్ధరాత్రి వరకు ఇంటికి పంపించేవాడు కాదు. నిత్యం ఆలస్యంగా వెళ్తుండటంతో బాధితురాలికి, ఆమె భర్తకు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలు తారాస్థాయికి చేరడంతో ప్రస్తుతం ఆమె భర్తకు విడాకుల నోటీసు ఇచ్చి, విడిగా ఉంటోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రొఫెసర్.. ఆమె ఒంటరితనాన్ని అవకాశంగా మలుచుకుని శారీరకంగా, మానసికంగా మరింత వేధించడం మొదలుపెట్టాడు.

ఓపిక నశించి.. పోలీసులను ఆశ్రయించి..
ప్రొఫెసర్ ఆగడాలు రోజురోజుకూ శృతిమించడంతో విసిగిపోయిన బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. తన జీవితాన్ని నాశనం చేసిన ప్రొఫెసర్‌పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడైన ప్రొఫెసర్‌ను అరెస్టు చేశారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. విద్యాాలయంలో జరిగిన ఈ ఘటన విద్యార్థులను, ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసింది.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading