* బీఆర్ఎస్ చేరికలే సాక్ష్యం
* భయపెడుతున్న ఆ రెండు రీజన్స్?
హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: ఏపీలో కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ తొలి అడుగు వేసింది. నిన్న ఏపీకి చెందిన పలువురు నేతల్ని తమ పార్టీలోకి చేర్చుకుని కేసీఆర్ కండువాలు కప్పేశారు. అయితే ఈ తొలి అడుగులోనే బీఆర్ఎస్ తడబడింది. కొత్త పార్టీలో తొలిసారి చేరికలు, అందునా పగ్గాలు అప్పగించాల్సిన సమయం, అలాంటి పరిస్ధితుల్లో కీలక నేతల్ని, సీనియర్లను ఎంచుకుని వారికి పగ్గాలు అప్పగించాల్సి ఉంది. కానీ కేసీఆర్ మాత్రం ఏపీలో ప్రస్తుతం నామమాత్రంగా కూడా పేరు వినిపించని నేతల్ని బీఆర్ఎస్ లో చేర్చుకుని మమా అనిపించేశారు.
ఏపీలో బీఆర్ఎస్ చేరికలు
తెలంగాణ కేంద్రగా ఆవిర్బవించించిన కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఏపీలో లాంఛనంగా అడుగుపెడుతోంది. ఇందులో భాగంగా ఏపీకి చెందిన పలువురు నేతల్ని బీఆర్ఎస్ లోకి చేర్చుకుంది. ఏపీలో కేసీఆర్ కు భారీ స్దాయిలో అభిమానం, అభిమానులు ఉన్నారని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు చేరికల విషయానికి వచ్చేసరికి తడబడ్డారు. వరుసగా మూడుసార్లు ఓటమిపాలైన మాజీ బ్యూరోక్రాట్ తోట చంద్రశేఖర్ ను బీఆర్ఎస్ లో చేర్చుకుని పార్టీ పగ్గాలు అప్పగించిన కేసీఆర్, మాజీ మంత్రి రావెలతో పాటు మరికొందరికి కూడా నిన్న కండువా కప్పారు. ఇంతకు మించి బీఆర్ఎస్ ఏపీలో చేయడానికి ఏమీ లేదనే సంకేతాలు దీంతో కనిపించాయి.
బీఆర్ఎస్ కు నేతల కరవు?
ఏపీలో బీఆర్ఎస్ పార్టీ తాజాగా అడుగుపెడుతోంది. ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలియదు. బీజేపీకి వ్యతిరేక వైఖరి తప్ప స్పష్టమైన విధివిధానాలేంటో తెలియదు. తెలంగాణ మంత్రుల ప్రకటనలు మినహాయిస్తే ఇప్పటివరకూ బీఆర్ఎస్ గురించి ఏపీలో తెలియడానికి ఏమీ లేదు. ఇలాంటి పరిస్దితుల్లో బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు రాష్ట్రానికి చెందిన నేతలెవరూ ముందుకు రాని పరిస్ధితి. అన్నింటికంటే మించి బీఆర్ఎస్ లో చేరితే వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువన్న ప్రచారం కూడా దీనికి తోడైనట్లు కనిపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ కు నేతలు మొహం చాటేసే పరిస్దితి నెలకొంది. నిన్న కేసీఆర్ సమక్షంలో చేరికల సమయంలో ఈ పరిస్ధితి స్పష్టంగా కనిపించింది.
మొహం చాటేసిన సీనియర్స్
ఏపీలో బీఆర్ఎస్ పగ్గాలు ఇచ్చేందుకు కేసీఆర్ పలువురు నేతలతో చర్చలు జరిపారు. ఓ ఉండవల్లి అరుణ్ కుమార్ తో మొదలుపెడితే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వరకూ చాలా మందిని ట్రై చేశారు. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీలు, సీనియర్లు, మాజీ మంత్రులు ఇలా ఎంతో మందిని ప్రయత్నించారు. కానీ సీనియర్లు ఎవరూ బీఆర్ఎస్ వైపు మొగ్గేందుకు ఇష్టపడని పరిస్దితి. దీంతో ఇప్పటిదాకా రాజకీయాల్లో గెలుపు మొహం చూడని తోట చంద్రశేఖర్ ను ఏపీ అధ్యక్షుడిగా నియమించుకునే పరిస్దితి. మాజీ మంత్రి అయిన రావెల కిషోర్ బాబే ఆయన కంటే చాలా బెటర్. దీంతో ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ ఎంత దారుణంగా ఉందో అర్దమవుతోంది.
అసలు కారణాలివే ?
ఏపీలో బీఆర్ఎస్ వైపు కీలక నేతలు, మాజీలు సైతం మొగ్గు చూపకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి బీజేపీ భయమైతే. రెండోది కేసీఆర్ గతంలో ప్రవచించిన తెలంగాణ వాదం. ఈ రెండు కారణాల్లో మొదటి దానికొస్తే.. ఏపీలో ప్రస్తుతం అన్ని పార్టీలు బీజేపీ జపం చేస్తున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన వంటి పార్టీలు బీజేపీతో ఏ స్ధాయిలో రాసుకుపూసుకు తిరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్ధితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా వెళితే వైసీపీ సర్కార్ నుంచి కూడా ఇబ్బందులు తప్పవన్న భావనతో కీలక నేతలు దూరమైనట్లు తెలుస్తోంది. అలాగే కేసీఆర్ గత తెలంగాణ వాద నేపథ్యం భవిష్యత్తులో బీఆర్ఎస్ పై ప్రభావం చూపితే తమకు డిపాజిట్లు కూడా దక్కవన్న భయం ఇక్కడి నేతల్లో ఉంది. దీంతో ద్వితీయ శ్రేణి నేతలు మినహా బీఆర్ఎస్ వైపు వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదని తెలుస్తోంది.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.