నవతరం

తెలుగు దినపత్రిక

చెలరేగిన వివాదం

* గద్దర్ అంత్యక్రియల విషయంలో చెలరేగిన వివాదం

హైదరాబాద్, ఆగస్టు 07(నమస్తే ఎల్లంపల్లి): ప్రజా యుద్ధ నౌక గద్దర్ నిన్న అస్తమించిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం దీనిపై వివాదం చెలరేగుతోంది. గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంచనాలతో చేయాలనుకోవడం పోలీసు అమరవీరులను అగౌరవ పరచడమేనంటూ యాంటి టెర్రరిజం ఫోరం (ATF) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గద్దర్‌కు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం నక్సలైట్ మావోయిజం వ్యతిరేక పోరాటంలో అమరులైన పోలీసుల, పౌరుల త్యాగాలను అవమానించడమేనని ఫోరం కన్వీనర్ రావినూతల శశిధర్ పేర్కొన్నారు. గద్దర్ తన విప్లవ పాటల ద్వారా వేలాది మంది యువకులను నక్సలైట్ ఉద్యమం వైపు మళ్ళించిన వ్యక్తి అని తెలిపారు . ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగాగా తుపాకీ పట్టిన నక్సల్స్ ఉద్యమం వేలాది మంది పోలీసులను బలితీసుకుందన్నారు. నక్సలిజం సాధారణ పౌరులతో పాటు జాతీయ వాదులపై కూడా దాడులు జరిపి అనేక మందిని బలితీసుకుందని శశిధర్ వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయిధ పోరాటాలు చేయడానికి తన సాహిత్యం ద్వారా యువతను దేశ ద్రోహులుగా తయారు చేసిన గద్దర్ లాంటి ఒక వ్యక్తికి నేడు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్య పరిరక్షణలో.. శాంతి భధ్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను.. ప్రజల త్యాగాలను అవమానించడమే అవుతుందన్నారు.

– లింగం శ్రీకాంత్, స్పెషల్ కరస్పాండెంట్

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading