నవతరం

తెలుగు దినపత్రిక

ములకలపల్లిలో అక్రమ ఇసుక నిల్వలపై రెవెన్యూ దాడి

– అధికారుల అండదండలతోనే? 6 ట్రాక్టర్ల ఇసుక సీజ్…!
– వాగు నుంచి యదేచ్చగానే ఈ మాఫియా ఆగడాలు షురూ

నవతరం, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకపై రెవెన్యూ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. వాగు ఒడ్డున ఎటువంటి అనుమతులు లేకుండా నిల్వ చేసిన సుమారు 6 ట్రాక్టర్ల ఇసుకను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఇసుకను సురక్షితంగా తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. స్థానిక సమాచారం ప్రకారం.. ఇసుక మాఫియా ముఠా ఒకటి మొర్రేడు వాగును లక్ష్యంగా చేసుకుని ఈ దందా సాగిస్తోంది. కేవలం అక్రమ సంపాదన ధ్యేయంగా పెట్టుకున్న ఒక ప్రధాన వ్యక్తి (ఇసుక డాన్), తనకున్న జెసిబిలు మరియు లారీలతో ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మొదట ట్రాక్టర్ల ద్వారా మొర్రేడు వాగు నుంచి ఇసుకను తీసి, వాగు ఒడ్డున గుట్టలుగా నిల్వ చేస్తారు.అనంతరం తమ సొంత జెసిబిల సాయంతో ఆ ఇసుకను లారీల్లోకి ఎక్కించి గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తారు.రాత్రికి రాత్రే ఈ భారీ వాహనాల ద్వారా ఇసుకను తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారు.ఈ అక్రమ వ్యాపారం వెనుక కొందరు అధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొంతమంది అధికారులను మేనేజ్ చేస్తూ, నిబంధనలను తుంగలో తొక్కి ఈ దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్న ఇలాంటి ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేవలం ఇసుకను సీజ్ చేయడమే కాకుండా, దీని వెనుక ఉన్న సూత్రధారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని  గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading