నవతరం

తెలుగు దినపత్రిక

కోనప్పను ఓడించి పంపేస్తాం

* సోమేష్ కుమార్, కెసిఆర్ కుమ్మక్కై ధరణి తెచ్చారు
* జె.ఎల్ పోస్టులకు దరఖాస్తు గడువు పెంచాలి
* గౌడన్నలు వేదాలను అవమానించలేదు
* డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ.

బెజ్జూర్ / ఆసిఫాబాద్, నమస్తే ఎల్లంపల్లి: తెలంగాణ ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ముఖ్యమంత్రి కెసిఆర్ కుమ్మక్కై ధరణి పోర్టల్ తెచ్చి, భూముల రికార్డులన్ని లేకుండా చేశారని, ప్రజలను ఇబ్బందులకు గిరిచేశారని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ధరణి వల్ల రాష్ట్రంలోని పేదల భూములన్ని ఆక్రమణకు గురయ్యాయని, విఆర్వో, విఆర్ఏ ఉద్యోగులకు అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతం కావడానికి,పేదల భూముల్లో వెంచర్లు వేయడానికి కారణం ముఖ్యమంత్రి, ఛీఫ్ సెక్రటరీలే కారణమని ఆయన పేర్కొన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా 163వ రోజు యాత్రలో భాగంగా ఆయన సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూర్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో బిసిలకు అన్యాయం జరుగుతుందన్నారు. 52 శాతం ఉన్న బిసిలకు ప్రభుత్వాలు కేవలం 27 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తూ అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. బిసిల రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. గౌడన్నలు వేదకమృతం అని పేరు పెడితే తప్పేంటని, బిసిలు కూడా వేదాలను గౌరవిస్తారని, వారు కూడా హిందువులేనని ఆయన స్పష్టం చేశారు.వేదాలను అవమానించే ఉద్దేశ్యంతో ఆ పేరు పెట్టలేదని ఆయన అన్నారు. బిసిల అభిప్రాయాలను గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే గడువును మరో పది రోజులకు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాంకేతిక లోపాల వల్ల అనేక మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారని ఆయన గుర్తు చేశారు. కావున పది రోజుల పాటు గడుపు పెంచాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు. నియోజకవర్గంలో నోటిఫైడ్ భూములు,పేదల భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, ఎమ్మెల్యే అనుచరులే అందుకు కారణమని ఆరోపించారు. ఎమ్మెల్యే కోనప్ప ఆంధ్రకు చెందిన వారికే కాంట్రాక్టులు ఇచ్చి సంపద కట్టబెడుతున్నారని ఆరోపించారు. బియ్యం, గుట్కా దందా చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారని తెలిపారు. తెలంగాణ వచ్చినా, సిర్పూర్ నియోజకవర్గంలో ఆంధ్ర పెత్తనమే కొనసాగుతుందన్నారు. ఈ అరాచకాలన్ని కెసిఆర్, కెటిఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రాంత వనరులు దోచుకొని ఆంధ్రవాల్లు కోట్లు సంపాదిస్తున్నారని తెలిపారు.అందుకే రాబోయే ఎన్నికల్లో కోనేరు కోనప్ప ను ఓడించి,కాళోజి చెప్పినట్లు ఆంధ్ర ప్రాంతం వరకు తరిమేస్తున్నామని ఆయన హెచ్చరించారు. బుధవారం యాత్ర నాగులవాయి, మార్తిడి, సులుగుపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సిడం గణపతి, నియోజకవర్గ ఇంచార్జి అర్షద్ హుస్సేన్, నియోజకవర్గ అధ్యక్షులు రాం ప్రసాద్, నియోజకవర్గ నాయకులు దుర్గం ప్రవీణ్, మహిళా నాయకురాలు జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading