నవతరం

తెలుగు దినపత్రిక

ప్రభుత్వ నిర్లక్ష్యంపై జర్నలిస్టుల గర్జన

* డిసెంబర్ 3న హైదరాబాద్‌లో మహా ధర్నా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో డిసెంబర్ 3వ తేదీన హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ వద్ద ఉన్న సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం ముందు భారీ ధర్నా జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల పట్ల తీవ్రమైన నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని, గత 12 సంవత్సరాలుగా జర్నలిస్టుల జీవితాలు ఏ మాత్రం మెరుగుపడలేదని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లలో అక్రిడిటేషన్ పాలసీని వెంటనే ప్రకటించి కొత్త కార్డులు జారీ చేయడం, ఆరోగ్య బీమా పథకాన్ని పునరుద్ధరించడం, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం, వృత్తి కమిటీలను ఏర్పాటు చేయడం, సంక్షోభంలో ఉన్న చిన్న, మధ్యతరగతి పత్రికలను ఆదుకోవడం వంటివి ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని వారు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో, నవంబర్ 6న జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని నిర్ణయించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొని తమ డిమాండ్లను సాధించుకోవాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె. విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణతో పాటు యూనియన్ సభ్యులు పిలుపునిచ్చారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading