- హర్షం వ్యక్తం చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
హైదరాబాద్, నవతరం: కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం 96 గదుల సత్రం నిర్మించడానికి ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ సిఫార్సుతో తిరుమల తిరుపతి దేవస్థానమ్ కు రూ. 35.19 కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు బండి సంజయ్ కుమార్. కొండగట్టు దర్శనానికి వచ్చే భక్తులకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుంది. కొండగట్టు అభివృద్ధి కోసం రూ. 100కోట్లు కేటాయిస్తామని చెప్పిన నాటి బీఆర్ఎస్ చిల్లిగవ్వ ఇవ్వలేదు. కాంగ్రెస్ నయా పైసా ఇవ్వకపోగా ఆర్జిత సేవల ఛార్జీలను సైతం పెంచి భక్తులపై భారం మోపిందని ధ్వజమెత్తారాయన. భక్తులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందిపడుతున్నా నాటి అధికార బీఆర్ఎస్, నేటి అధికార కాంగ్రెస్ పార్టీలు పట్టించుకోలేదు. కాంగ్రెస్ పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కొండగట్టు ఆలయానికి నిధులు కేటాయించి, అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నారు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































