* ఇండియాకు పరారైన నిందితుడు అర్జున్ శర్మ తమిళనాడులో అరెస్ట్
నవతరం, అశ్వారావుపేట: అమెరికాలో తెలుగు యువతి నిహారిక హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిహారికను హత్య చేసిన అనంతరం భారత్కు పరారైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్జున్ శర్మను తమిళనాడులో ఇంటర్పోల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో సంచలనం రేపింది. అమెరికాలో నిహారిక హత్యకు గురైన తర్వాత కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న అక్కడి పోలీసులు, ఇంటర్పోల్ సహకారంతో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా అర్జున్ శర్మ భారత్కు పారిపోయినట్టు గుర్తించిన అధికారులు, అతని కదలికలను ట్రాక్ చేసి తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా ఈ అరెస్ట్ జరగినట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, అతడిని అమెరికాకు అప్పగించే ప్రక్రియపై కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ కేసు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రవాస తెలుగు సమాజంలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. నిహారికకు న్యాయం జరగాలని, నిందితుడికి కఠిన శిక్ష పడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు పూర్తి వివరాలు త్వరలో వెల్లడించే అవకాశముంది.




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































