- వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
కామారెడ్డి, నమస్తే ఎల్లంపల్లి: తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండేందుకె కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ను అందుబాటులోకి తేవడం జరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ నుంచి వర్చువల్ మోడ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా జరగిన ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్ పాల్గొన్నారు. వర్చువల్ ద్వారా ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్-బాల్కసుమన్, ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం – పువ్వాడ అజయ్ కుమార్, ములుగు – సత్యవతి రాథోడ్, జయశంకర్ భూపాలపల్లి – ఎర్రబెల్లి దయాకర్ రావు, వికారాబాద్ – సబిత ఇంద్రారెడ్డి, నాగర్ కర్నూల్ – శ్రీనివాస్ గౌడ్, గద్వాల్ జిల్లా నుంచి మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గర్భిణుల వద్దకు వెళ్ళి కిట్స్ పంపిణీ చేశారు. ఇదే వేడుకగా ఏఎన్ఎంలకు చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. బిడ్డ కడుపులో పడ్డప్పుడు న్యూట్రీషన్ కిట్, డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్ అందించడం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ మరో అద్భుతమైన పథకానికి రూపకల్పన చేశారని, న్యూట్రిషన్ కిట్స్ గర్భిణులకు వరంగా మారనున్నాయన్నారు. తమవి న్యూట్రిషన్ పాలిటిక్స్.. వారివి పార్టిషన్ పాలిటిక్స్ అని విమర్శించారు. ప్రజా కోణంలో ఆలోచించి సీఎం కేసీఆర్ పథకాలు ప్రారంభిస్తారన్నారు. మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్ కిట్ సూపర్ హిట్ అయిందని, ఇదే స్ఫూర్తితో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లకు రూపకల్పన చేశామన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో పుట్టిన కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ పథకాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, ఇదొక చారిత్రక ఘట్టమన్నారు. ఎక్కువగా ఎనీమియా (రక్త హీనత) ప్రభావంతో ఉన్న గర్బిణుల సంఖ్య 9 జిల్లాల్లో ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, ఇందులో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ ఉన్నాయన్నారు. 9 జిల్లాల్లో మొత్తం 1.25 లక్షల మంది గర్బిణులకు రెండు ఏఎన్సీల్లో మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, దీని కోసం ప్రభుత్వం 50 కోట్లు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, ఐరన్ లను పోషకాహారం ద్వారా అందించి రక్త హీనత తగ్గించడం, హీమోగ్లోబిన్ శాతం పెంచడం న్యూట్రీషన్ కిట్ల లక్ష్యమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఒక్కో కిట్ దాదాపు 2 వేలతో రూపొందించి, కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని, 13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్సీ చెకప్ సమయంలో ఒకసారి, 28-34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్సీ చెకప్ సమయంలో రెండో సారి ఈ కిట్లను ఇవ్వడం జరుగుతుందన్నారు. 9 జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వం ఈ పంపిణీ చేస్తుందన్నారు. ఈ న్యూట్రీషన్ కిట్లలో కిలో న్యూట్రీషన్ మిక్స్ పౌడర్, కిలో ఖర్జూర, ఐరన్ సిరప్ 3 బాటిల్స్, 500 గ్రాముల నెయ్యి, ఆల్బెండజోల్ టాబ్లెట్, ఒకక్ కప్పు, ఒక ప్లాస్టిక్ బాస్కెట్ ఉంటాయన్నారు. రక్త హీనత గర్బిణుల పాలిట శాపంగా మారుతుందని, గర్బిణులకు ప్రసవాలు సంక్లిష్టంగా మారుతున్నాయని, ఎనీమియా నివారించడం వల్ల మాతృ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. మాతా శిశు సంరక్షణ కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మాతృ మరణాలు తగ్గించడంలో గొప్ప వృద్ధిని నమోదు చేసిందని చెప్పారు. ఈనెలలో విడుదలైన కేంద్ర ప్రభుత్వ శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం, రాష్ట్రంలో మాతృ మరణాల రేటు 2014లో 92 ఉండగా, ప్రస్తుతానికి 43కు తగ్గిందని, మాతృమరణాలు తగ్గించడంలో దేశంలోనే మనం మూడో స్థానంలో నిలిచామన్నారు. ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు కేసీఆర్ న్యూట్రీషన్ కిట్స్ పథకాన్ని అమలు చేస్తున్నదని, ఇది గొప్ప మార్పునకు నాంది పలుకనున్నదన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలు అడగకుండానే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, మంచి నీళ్ల కష్టాలు తీర్చారని, బీడీ చేసే మహిళలు, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్లు ఇస్తున్నారని, ఆడపిల్లలు బాగా చదువుకోవాలని గురుకులాలు ప్రారంభించారని, 68 మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలు ప్రారంభించారని, పేదింటి ఆడ పిల్ల పెళ్లికి లక్షా 116 ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టి ఆర్ ఎస్ ప్రభుత్వమని, తల్లి ఆరోగ్యం కోసం ఇప్పుడు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాలు ఉన్నాయన్నారు. తెలంగాణ వచ్చాక ఆసుపత్రులు బాగయ్యాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం డెలివరీలు 66 శాతం పెరిగాయని, ఆస్పత్రుల్లో పడకలు 17 వేల నుండి 28 వేల పడకలు పెంచుకున్నామని, ఐసియు బెడ్స్ 200 నుంచి 600 వందలకు పేంచుకున్నామన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామని, ఈ ఏడాది లోనే 12 ప్రారంభించుకున్నామన్నారు. ఎంఎంఅర్ మనం 2014 లో 92 ఉంటే 43 కు తగ్గించుకున్నామని, తగ్గింపులో దేశంలో రెండో స్థానంలో ఉన్నామని, మొన్ననే కేంద్రం రెండు అవార్డులు మనకు ఇచ్చిదన్నారు. నాలుగు ఏఎన్సీ చెకప్స్, కేసీఆర్ కిట్లు, అమ్మ ఒడి వాహనాలు, మాతా శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల రాష్ట్రంలో గణనీయమైన మార్పులు వచ్చాయన్నారు. 2014లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30శాతం ప్రసవాలు జరిగితే, ఇప్పుడు 66 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయని, 2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన మార్పు చూస్తే ఇనిస్టిట్యూషనల్ డెలివరీలు-91 నుంచి 99.7 శాతానికి పెరిగాయని,(దేశ సగటు 79), ఎంఎంఆర్ (మాతృమరణాల రేటు, లక్షకు)- 92 నుంచి 43 కు తగ్గిందని, (దేశ సగటు 97) ఐఎంఆర్(శిశు మరణాల రేటు, లక్షకు) -39 నుంచి 21 (దేశ సగటు 32) ఉందన్నారు. ప్రజల మధ్య ఎలా చిచ్చు పెట్టాలని కొందరు ఆలోచిస్తారని, మావి న్యూట్రిషన్ పాలిటిక్స్ అయితే వారివి పార్టిషన్ పాలిటిక్స్ అని ఎద్దేవా చేశారు.
గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్న వేముల ప్రశాంత్ రెడ్డి
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లాంటి గొప్ప కార్యక్రమంలో తనకు భాగస్వామ్యం కల్పించినందుకు సంతోషంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా, మానవత్వంతో తల్లి, బిడ్డ కోసం మంచి కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈరోజు పుట్టబోయే బిడ్డలే, మన జాతి సంపద అని, వారు బాగుంటే దేశం బాగు పడుతుందన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా 16 వస్తువులతో పాటు, తల్లి బిడ్డకు మనం 12 వేల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. ఆశ వర్కర్లు అమ్మగా కనిపిస్తున్నారని, గొప్పగా పని చేస్తున్నారని కొనియాడారు. అరోగ్య శాఖలో ఇంత పని ఉంటుందని మంత్రి హరీశ్ రావు చూపిస్తున్నారని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ లక్ష్యం వైపు రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తున్నారన్నారు.
తల్లులు క్షేమంగా ఉంటే సమాజం క్షేమంగా ఉంటుందన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
తల్లులు క్షేమంగా ఉంటే సమాజం క్షేమంగా ఉంటుందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తల్లులు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకున్నారు కాబట్టి నాడు సాధారణ ప్రసవాలు జరిగాయన్నారు. తల్లులు క్షేమంగా ఉంటే సమాజం క్షేమంగా ఉంటుందని, అందుకే సీఎం కేసీఆర్, కేసీఆర్ కిట్స్, న్యూట్రిషన్ కిట్స్ ప్రారంబించారని చెప్పారు. ఇప్పటివరకు 12 లక్షల మంది కిట్స్ అందుకున్నారన్నారు. ఈ దేశానికి కావాల్సింది రాజకీయ నాయకుడు కాదని, ప్రజా నాయకుడన్నారు. ప్రభుత్వాలు పడగొట్టే ప్రయత్నానికి ఉన్నవారు ఎందుకని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జెడ్పి చైర్ పర్సన్ శోభ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, కలెక్టర్ జిటేష్ వి పాటిల్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఇందూ ప్రియ, అధికారులు పాల్గొన్నారు.
క్రిటికల్ కేర్ నిర్మాణానికి శంకుస్థాపన.. ఎంసిహెచ్ పరిశీలన
దేవునిపల్లి శివారులో ఎంసిహెచ్ ఆస్పత్రి పక్కనే 23.75 కోట్లతో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ కు మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పక్కనే నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు ఆస్పత్రి పనులను పరిశీలించారు. ఆస్పత్రి నిర్మాణ పనులను అధికారులు, కాంట్రాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. మార్చి లోపు ఆస్పత్రి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే మెడికల్ కళాశాల మంజూరైనందున ఆస్పత్రి పనులు త్వరగా పూర్తి చేస్తే మెడికల్ కళాశాల విద్యార్థులకు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి క్లాసులు ప్రారంభించుకోవచ్చని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
మంత్రి పర్యటన.. రైతుల అరెస్టులు
కామారెడ్డి జిల్లా కేంద్రానికి మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత కొద్దిరోజులుగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తో తాము భూములు కోల్పోతున్నామని, అధికార పార్టీ నేతలు కావాలని భూములను లాక్కుంటున్నారని, ఇందులో ఎమ్మెల్యేల హస్తం ఉందంటూ అందోళన చేస్తున్నారు. బుధవారం మంత్రి కామరెడ్డికి వస్తున్నారని మంత్రిని కలిసి తమ సమస్య చెప్పుకుందామని భావించిన రైతులకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. ఎక్కడికక్కడ రైతులను ముందస్తుగా అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయినా అక్కడక్కడ రైతులు చేరుకుని మంత్రిని కలవడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంత్రి ఉన్నారని తెలుసుకుని ముగ్గురు రైతులు కలెక్టరేట్ కు చేరుకోగా వారిని పోలీసులు గేటు వద్దనే అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద మంత్రి భోజనం చేస్తున్న సమయంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేస్తామని చెప్పినా వినకుండా పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కార్యకర్తలు, నాయకులలో కలిసిపోయి ఉన్న రైతులను పోలీసులు డేగకన్నుతో పరిశీలించారు. ఎక్కడెక్కడ రైతులు ఉన్నారో క్షుణ్ణంగా పరిశీలిస్తూ బయటకు పంపించేశారు. అనుమానం వచ్చిన అధికార పార్టీకి చెందిన సర్పంచులు, ఇతర నాయకులను సైతం బయటకు పంపించేశారు.
మంత్రి పర్యటన షెడ్యూల్ చేంజ్
మంత్రి హరీష్ రావు పర్యటనలో ఆకస్మికంగా షెడ్యూల్ చేంజ్ చేశారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ కు శంకుస్థాపన చేసి ఎంసిహెచ్ పనులను పరిశీలించాల్సి ఉండగా షెడ్యూల్ ను అప్పటికప్పుడు మార్చేశారు. రైతులు అడ్డుకుంటారన్న సమాచారంతో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి దేవునిపల్లి మీదుగా ఎంసిహెచ్ వరకు వెళ్లాల్సి ఉండగా నిజాంసాగర్ చౌరస్తా నుంచి రైల్వే కమాన్, రామారెడ్డి చౌరస్తా, గుమస్తా కాలనీ మీదుగా కలెక్టరేట్ వరకు మంత్రి కాన్వాయి బయలుదేరింది. 11 గంటలకు ప్రారంభించాల్సిన న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాన్ని ముందుగానే ప్రారబించారు. అనంతరం కలెక్టరేట్ నుంచి గుమస్తా కాలనీ, టెక్రియాల్ బైపాస్, కొత్త బస్టాండ్, నిజాంసాగర్ చౌరస్తా, దేవునిపల్లి మీదుగా ఎంసిహెచ్ వరకు వెళ్లి అక్కడ క్రిటికల్ కేర్ కేంద్రానికి శంకుస్థాపన చేసి ఎంసిహెచ్ పనులను పరిశీలించారు.







































































































































































































































































































You must be logged in to post a comment.