నవతరం

తెలుగు దినపత్రిక

అంబేద్కర్ ఫోటో ఖచ్చితంగా పెట్టేలా చర్యలు తీసుకోవాలి

అంబేద్కర్ ప్రజాసంఘం ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ కు వినతి

హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: గణతంత్ర దినోత్సవంలో అంబేద్కర్ ఫోటో ప్రతి దగ్గర కచ్చితంగా పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం అన్నారు. ఈ మేరకు సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డికి ఆ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టకపోవడం ఆయనను అవమానించడమే అవుతుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ విద్యాసంస్థలలో కూడా ఆయన పట్ల వివక్షత చూపిస్తున్నారని అన్నారు. రాజ్యాంగ రచనకు, ఆమోద ప్రక్రియలకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల ఫోటోలు పెట్టి అంబేద్కర్ ను విస్మరించడం సరైంది కాదన్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 73 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా ఇలాంటి పరిస్థితి రావడం దేశానికే సిగ్గుచేటు అన్నారు. తరాల క్రితం నాటి కుల వివక్షతను నేటి ప్రజాస్వామ్య, లౌకిక దేశంలో పాటించడం అనైతికం అన్నారు. అంబేద్కర్ గురించి ఈ సమాజం తెలుసుకుంటే సమానత్వం వైపు ప్రజలు ఆలోచిస్తారని, సమానత్వాన్ని సహించని అనేకమంది ఇలాంటి దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అంబేద్కర్ ఆలోచన విధానం ద్వారానే దేశంలో సోదర భావం పెరుగుతుందని, తద్వారా దేశం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. భూమిపైన ఏ ప్రాణిలో లేని అసమానతలు మనిషిలో ఉండడం విస్మయానికి గురి చేస్తుందని తెలిపారు. ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ జ్ఞానాన్ని భారతదేశ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన దేశంలో ఏ ఒక్క వర్గం కోసం పనిచేయలేదని, అందరికీ స్వేచ్ఛ, హక్కులు కల్పించారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. కావున ఇప్పటికైనా జాతీయ జెండా ఎగురవేసే ప్రతి దగ్గర అంబేద్కర్ ఫోటో ఉంచే విధంగా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయాలని అదనపు కలెక్టర్ కు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ప్రజా సంఘం మేడ్చల్ జిల్లా ఇంచార్జీ చేగూరి మహేందర్ పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading